కావలి రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..భయంతో పరుగులుపెట్టిన ప్రయాణికులు

ఈ మధ్య వరుసగా రైల్లో పొగలు వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి ఢిల్లీ హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు రావడం ప్రయాణికులను భయాందోనళకు గురి చేసింది. ఈ ఘటన కావలి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

బీ-5 బోగీలో నుంచి పొగలు రావటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రయాణికులు భయంతో కిందకు దిగారు. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ కావటంతోనే పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో కావలి రైల్వే స్టేషన్‌లోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే ఈ ఘటనతో ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.