కాణిపాకం ఆలయ సిబ్బంది ఇంట్లో జింక చర్మం

కాణిపాకం ఆలయంలో పనిచేసే సిబ్బంది ఇంట్లో జింక చర్మం లభించడం కలకలం రేపుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహించగా.. ఓ అర్చకుడి నివాసంలో జింక చర్మం చూసి ఖంగుతిన్నారు. ఆలయంలోని ప్రసాదాలు తయారుచేసే పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆలయ ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో సిబ్బంది నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్‌ నివాసంలో జింకచర్మాన్ని గుర్తించారు. ఈ విషయం గురించి అటవీశాఖ అధికారులకు ఈవో వెంకటేశు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు.

డీఎఫ్‌వో చైతన్య కుమార్‌రెడ్డి ఆదేశాలతో జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు.. కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ద్వారా జింకచర్మాన్ని తాను కొనుగోలు చేసినట్టు విచారణలో కృష్ణమోహన్‌ వెల్లడించారని, విక్రయించిన నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎఫ్‌ఆర్వో బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇక గత కొద్దీ రోజులుగా ఆలయంలో పనిచేసే సిబ్బంది ఫై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో అధికారులు సోదాలు చేపట్టారు. నలుగురు వంట మనుషుల ఇళ్లలో పెద్దఎత్తున బియ్యం బస్తాలు, ఇతర సామాగ్రిని గుర్తించారు. చినకాంపల్లెకు చెందిన అన్నదాన సత్రంలో పనిచేస్తున్న ఓ మహిళ, గొడౌన్, పోటులో పనిచేసే వారి ఇళ్లలో బియ్యం, చక్కెర, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.