షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేపట్టగా..ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసి , అదుపులోకి తీసుకున్నారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె దీక్షకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. కాగా ఈ దీక్షకు పోలీసుల అనుమతి లేదంటూ ఆమెను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలను పక్కకు తోసేసి ఆమెను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తన పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. తన పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ కూడా ఉందని… అయినప్పటికీ కేసీఆర్ న్యాయస్థానాన్ని కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని… ఆయన పతనానికి ఇదే నాంది అని అన్నారు.