నోట్ల రద్దు పిటిషన్లపై విచారించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 16న వాదనలు విననున్నది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరుపనున్నది. ముందుగా తెలిసిన సమాచారం ప్రకారం ఈరోజు (సెప్టెంబర్ 28న) నోట్స్ బ్యాన్ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం వాదనలు వినాల్సి ఉంది. కానీ, కొన్ని న్యాయపరమైన కారణాలవల్ల విచారణ తేదీ అక్టోబర్ 12కు మారింది.
ప్రధాని నరేంద్రమోడీ 2016 సెప్టెంబర్ 8న పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేశారు. రూ.500 నోటుకు బదులుగా కొత్త నోటును తీసుకురాగా, పాత రూ.1000 నోటును పూర్తిగా రద్దుచేశారు. దాని స్థానంలో రూ.2000 నోటును తీసుకొచ్చారు. అయితే ఈ నోట్ల రద్దు కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు కోసం నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఆ నోట్ల బ్యాన్ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.
అందుకే నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలోనే నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి దర్యాప్తును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేస్తున్నట్లు 2016, డిసెంబర్ 16న ప్రకటించింది. కానీ, ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/