తెలుగు రాష్ట్రాలతో సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు!

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః బొంబాయి. గుజరాత్‌, తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. ఒడిశా, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం బుధవారం సమావేశమై చర్చించారు.

కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత మహిళా న్యాయమూర్తి సునీతా అగర్వాల్ గుజరాత్ హైకోర్టు బాధ్యతలు చేపట్టనున్నారు. కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తులందరూ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా సరిపోతారని పేర్కొంది. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ్‌ పేరు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. అలాగే గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్‌ హైకోర్టు జడ్జి సునీతా అగర్వాల్‌ పేరును సూచించింది.

కర్ణాటక హైకోర్టు జస్టిస్‌ అలోక్‌ ఆరదే పేరును తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు జడ్జి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ పేరును మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూచించింది. అలాగే ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాసిష్‌ తలపత్ర (ఒడిశా), గుజరాత్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఆశిష్‌ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కేంద్రానికి సిఫారసు చేసింది.

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తులకు పదోన్నతి లభించనున్నది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.