ఢిల్లీ పర్యటనలో జగన్ మోడీతో ఇదే మాట్లాడారుః రఘురామకృష్ణ రాజు

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న వైఎస్‌ఆర్‌సిపి రెబల్ ఎంపీ

ysrcp-rebel-mp-raghurama-krishna-raju-predicts-early-polls-in-ap

అమరావతిః ఏపిలో ముందస్తు ఎన్నికలు ఖాయమని వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీతో ఇదే విషయం చర్చించినట్టు తెలిపారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం రఘురామ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

‘‘ఎన్డీయేలో చేరేందుకు ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే, తెలంగాణతో పాటూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లటానికి సూత్రప్రాయంగా పెద్దలు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించేందుకు ఏంపీ మిథున్ రెడ్డి వాటిని ఖండించారు. టీవీ ఛానళ్లకు లీకులు వాళ్లే ఇచ్చారు. మళ్లీ వాటిని నమ్మొద్దని వాళ్లే ప్రకటనలు చేశారు. దాని వల్ల ప్రతిపక్షాలు ఎన్నికలకు సమాయత్తం కావన్నది వారి భావన. నిజాన్ని అతి పొదుపుగా వాడే వ్యక్తుల్లో జగన్ ఒకరు. ఆయన చెప్పే పని ఏదీ చేయరు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లేవని చెప్పారంటే కచ్చితంగా ఉన్నట్టే భావించాలి. అందువల్ల ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలి, ఒకటి రెండు రోజుల్లో దీనిపై అదనపు సమాచారం బయటకు వస్తుంది’’ అని రఘురామకృష్ణ రాజు తెలిపారు.