పరువు నష్టం కేసు : రాహుల్ కు ఊరట

రాహుల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ‘మోడీ ఇంటి పేరు’పై పరువు నష్టం కేసులో గుజరాత్ ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్దించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. సూరత్ కోర్టు తీర్పును నిలిపేసేందుకు హైకోర్టు తిరస్కరించడాన్ని ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. రాహుల్ గాంధీ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. అత్యవసర విచారణ జరపాలని కోరారు. జులై 21న లేదా 24న దీనిపై విచారణ జరపాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది.

దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ఈ నెల 21న విచారణ జరిపేందుకు అంగీకరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు చెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.