ఈసీకి చంద్రబాబు వైరస్ – సజ్జల
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/05/ysrcp-leader-sajjala-ramakrishna-reddy-fires-on-media-reaction-on-ys-avinash-reddy-jpg.webp)
ఏపీలో రాజకీయ పరిణామాలు, ఈసీ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కూటమి ఏర్పడ్డాక ఈసీ తీరు మారిందన్నారు..కూటమి చెప్పినట్లు ఈసీ వ్యవహరిస్తుందని , ఈసీకి చంద్రబాబు వైరస్ సోకినట్లు ఉందని సజ్జల పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదే సమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదని నిలదీశారు.
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించేట్టయితే, రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ బయటపెట్టాలని అన్నారు. బాధితులమని చెప్పుకుంటున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగడంలేదని ప్రశ్నించారు. అడ్డంగా రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టే టీడీపీ వాళ్లు రీపోలింగ్ అడగడంలేదని, దానివల్ల దెబ్బతిన్నారు కాబట్టి మా వాళ్లు అడుగుతున్నారు అని సజ్జల పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని సజ్జల తమ పార్టీ నేతలకు సూచించారు.