రష్యాలో నేడు విక్టరీ డే ఉత్సవాలు..పుతిన్ ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ

ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించే యోచనలో పుతిన్

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే నెలలు గడుస్తున్నా విజయం అందకుండా పోతుండడంతో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏడాది మే 9 న ‘విక్టరీ డే’ జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 11 వారాలుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అలాగే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నాజీలపై పోరుగా అభివర్ణిస్తూ వెంటనే సైనిక బలాల్లో చేరాలంటూ పౌరులకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద నేడు ఆయన చేయనున్న ‘విక్టరీ డే’ ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, నాజీయిజం మళ్లీ పురుడుపోసుకోకుండా అడ్డుకుందామని అజర్‌బైజాన్, ఆర్మేనియా, బెలారస్, కజఖ్‌స్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్ తదితర కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాల ప్రజలకు పుతిన్ పిలుపునిచ్చారు. విక్టరీ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/