టీఎస్ ఆర్టీసీ చార్జీల బాదుడు..మళ్లీ మళ్లీ ఉంటుందట..

ప్రయాణికులపై టీఎస్ ఆర్టీసీ చార్జీల వాత పెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా చమురు సంస్థలు పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెంచుతూ వస్తుండడం ఆ ఎఫెక్ట్ ప్రతిదీ దానిపై పడుతుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీ..ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా మరింత నష్టాల్లోకి వెళ్లింది . ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయాణికులపై భారం మోపక తప్పలేదు. డీజిల్‌ సెస్‌ ఛార్జీల పేరుతో బస్సు ఛార్జీలను శనివారం నుండి పెంచడం జరిగింది.

పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసులకు డీజిల్ సెస్ కింద రూ. 2 చొప్పున, ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులకు రూ. 5 పెంచుతున్నట్టు తెలిపింది. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్‌ ధరను రూ. 10 గా నిర్ణయించింది. దీంతో అయిపోలేదట. డీజిల్‌ ధరలు ఇంకా పెరిగితే బస్‌ ఛార్జీలు మళ్లీ పెంచే అవకాశం ఉంటుందని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీని గట్టేక్కించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డీజిల్‌ ధరలు మరింతగా పెరిగితే సెస్‌ రూంలో ఛార్జీలు పెంచక తప్పదని తేల్చి చెప్పారు.