లోక కల్యాణం కోసమే మునులు భారత్‌ను సృష్టించారుః ఆరెస్సెస్ చీఫ్

‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకాన్ని రచించిన ఆరెస్సెస్ కార్యకర్త

RSS Chief Says Bharat Has Been A Secular Nation For 5,000 Years

న్యూఢిల్లీః భారత్ 5 వేల ఏళ్లుగా లౌకిక దేశమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దేశ ప్రజలు కలిసి ఉండాలని, ప్రపంచం ముందు మానవ ప్రవర్తనకు అత్యుత్తమ ఉదాహరణగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ కార్యకర్త రంగాహరి రచించిన ‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభూమిపై భక్తి ప్రదర్శించాలని, ప్రేమగా, అంకితభావంతో మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ ఐక్యతకు మాతృభూమిని మనం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.

‘‘మన 5 వేల ఏళ్ల సంస్కృతి లౌకికమైనదే. అన్ని తత్వజ్ఞానాల్లోనూ ఇదే ఉంది. ఈ మొత్తం ప్రపంచం ఒకే కుటుంబమనేది మన భావన. ఇది సిద్ధాంతం కాదన్న విషయన్ని తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి’’ అని భాగవత్ పేర్కొన్నారు. దేశంలో వైవిధ్యం చాలా ఉందని, ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దని సూచించారు. మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దేశాన్ని తయారుచేయాలని ఉద్బోధించారు. లోక కల్యాణం కోసమే మన మునులు భారత్‌ను సృష్టించారని, దేశంలోని చివరి వ్యక్తికి కూడా తమ జ్ఞానాన్ని అందించే సమాజాన్ని సృష్టించారని భాగవత్ వివరించారు.