అధికార పార్టీ కార్యాలయంగా పార్లమెంటును మార్చోదుః రేవంత్ రెడ్డి
పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని మోడి ఆవిష్కరించడంపై రేవంత్ అభ్యంతరం
హైదరాబాద్ః ప్రధాని మోడి నిన్న దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే విపక్షాలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా అక్కడ కనిపించలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్కు మంగళవారం ఓ లేఖ రాశారు.
విపక్షాలకు చెందిన సభ్యులు లేకుండా పార్లమెంటులో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తన లేఖలో ఓం బిర్లాను ప్రశ్నించారు. పార్లమెంటు భవనంలో ఏ కార్యక్రమం నిర్వహించినా విపక్షాలు, వాటి నేతలను తప్పనిసరిగా ఆహ్వానిస్తారు కదా అని రేవంత్ పేర్కొన్నారు. ఈ తరహా సంప్రదాయంతోనే పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడుతూ వస్తున్నామని కూడా ఆయన తెలిపారు. అధికార పార్టీకి చెందిన కార్యాలయం మాదిరిగా పార్లమెంటును మార్చలేమని, మార్చకూడదని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మీదేనని కూడా స్పీకర్కు ఆయన సూచించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/