మేడారం వనదేవతలను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర ప్రారంభానికి ముందు సోమవారం మేడారం సమ్మక్క , సారక్కలను దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న ఆయనకు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో ను యాత్రను రేవంత్ మరికాసేపట్లో మొదలు పెట్టనున్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న రేవంత్ ..ఇప్పుడు పాదయాత్ర తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ఈ యాత్రను ప్రారంభించనున్నారు. 60 రోజుల పాటు తెలంగాణలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ యాత్రలో అన్ని రంగాల ప్రజలు పాల్గొని సంఘీభావం తెలుపాలని సీతక్క పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుని.. పేద ప్రజలకు భవిష్యత్ భరోసా ఇచ్చేదే ఈ పాదయాత్ర అని ఆమె చెప్పుకొచ్చారు. కాసేపట్లో పస్రాలో నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం పాలంపేటలో నైట్ బస చేసి మరుసటి రోజు ఉదయం అక్కడి ప్రజలను కలవనున్నారు. అక్కడ నుంచి ఘనపూర్, భూపాలపల్లి జంక్షన్ వెల్తూర్ పల్లిలో రెండో రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా ములుగు నియోజకవర్గంలో రెండు బహింగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.