పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడం తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ లో రోజు రోజుకు బలం పెంచుకుంటుంది. రీసెంట్ గా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ చేరడం తో పార్టీకి మరింత బలం వచ్చినట్లు అయ్యింది. రాబోయే ఎన్నికల్లో అంత కలిసి కట్టుగా పనిచేయాలని ఎలాంటి విభేదాలు పెట్టుకోకూడదని రాహుల్ సూచించడంతో నేతలు కూడా రాహుల్ మాటకు కట్టుపడి ఉంటామని అంటున్నారు.

ఇదే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని సొంతపార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. బీజేపీ, బీఆరెస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని అన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలని.. గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. బీజేపీ, బీఆరెస్ ను ఎదుర్కొనేందుకు మన శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలని.. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు.

ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో పార్టీ బూత్ ఎన్ రోలర్సే బీఎల్ఏ లు అని వివరించారు. యాక్టివ్ గా ఉన్న బూత్ ఎన్ రోలర్స్ ను బీఎల్ఏ లుగా నియమిచుకోవాలని.. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.