పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 16.48 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీధి వ్యాపారులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఉత్పత్తి రంగం బలోపేతానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. కేంద్రం మంచి పని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం అని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ వ్యూహాలు చేయాలని కేటీఆర్ సూచించారు.
రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా టీఎస్ ఐపాస్ గురించి మాట్లాడుతున్నారు. పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే జరిమానా వేసే రాష్ట్రం మనది ఒక్కటే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త పథకాలు తేవడం కాదు.. వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేయాలి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్లుగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/