బీఆర్ఎస్ కోటకు బీటలు వారాయి అంటూ రేవంత్ కామెంట్స్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు లకు సానుభూతి తెలియజేసారు. బీఆర్ఎస్ కోటకు బీటలు వారాయి. ఇద్దరూ తిరుగుబాటు జెండా ఎగరేశారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు కేసీఆర్‌ను నమ్మి మాజీలు అయ్యారని రేవంత్ అన్నారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు ఇద్దరూ ఎటు వెళ్తారో చూద్దాం అని, ఎవరు, ఎవరి దగ్గరకు వస్తారో కాలమే నిర్ణయిస్తుందన్నారు.

ఇక సస్పెండ్ కు గురైన వీరిద్దర్నీ బిజెపి లోకి తెచ్చుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే పొంగులేటికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టచ్‌లోకి వెళ్లగా.. ఇటు జూపల్లిని డీకే అరుణ డైరెక్టుగా వెళ్లి బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. కాగా పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెపుతూ వస్తున్నారు . అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటిపై ఒత్తిడి తెస్తోంది. ఇటు జూపల్లి మూలాలు కూడా కాంగ్రెస్‌వే కాబట్టి ఆయన హస్తం పార్టీవైపే చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారా..లేక బిజెపి లోకి వెళ్తారా అనేది చూడాలి.