జగదిగ్బంధంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇక శ్రీకాకుళం లోని ఆర్టీసీ కాంప్లెక్స్ జగదిగ్బంధంలో చిక్కుకుంది. కాంప్లెక్స్ లోకి వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల మొదలు లోపల ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణమంతా మోకాలు లోతులో వరదనీరు నిలిచిపోయింది. కాంప్లెక్స్ లోని దుకాణాలు, పాసింజర్ల వెయిటింగ్ ప్రాంగణం, టూ వీలర్స్ పార్కింగ్ ప్లేస్, కొరియర్ అండ్ లాజిస్టిక్స్ సెంటర్ ఇలా అన్ని కూడా నీటిలో మునిగిపోయాయి.

ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న బస్సు ఎక్కడానికి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు లగేజీలతో బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారి నుండి కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతూనే మోకాళ్లలోతు నీరు ఉండటంతో శ్రీకాకుళంలో దిగాల్సిన పాసింజర్లను రోడ్డుపైనే దించి బస్సు లోపలికి వెళ్లే పరిస్థితి నెలకొంది. వరద నీటిలోనే ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకోగా.. కౌంటర్ల లోపల ఉన్న ఆర్టీసీ సిబ్బంది సైతం వరద నీటిలోనే విధులు నిర్వర్తించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కాంప్లెక్స్ దయనీయ పరిస్థితి పై పాలకులు దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.