తెల్లవారుజామున హైదరాబాద్ లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం

హైదరాబాద్ లో తెల్లవారుజామున ఉరుములు,మెరుపులతో భారీ వర్షం పడింది. గత కొద్దీ రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త సేద తీర్చింది. ఉదయం జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, అమీర్ పేటర్ ,యూసఫ్ గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, నేరెడ్ పెట్, కుత్బుల్లాపూర్, ముషిరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి ,పాతబస్తీ , రాజేంద్ర నగర్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలి, ఏరియాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రాజేంద్రనగర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు కాగా, అంబర్‌పేట, శేరిలింగంపల్లి, శివరాంపల్లిలో 3.9 సెం.మీ చొప్పున వర్షంపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటూ నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.