జులై 12న కాజీపేటకు ప్రధాని మోడీ రాక..?

ప్రధాని మోడీ జులై 12 న కాజీపేటకు రానున్నట్లు బిజెపి వర్గాలు చెపుతున్నాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) కేంద్రానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని అంటున్నారు.

బిజెపి మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాని రాష్ట్రానికి రావాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడిందని, జులై 12న వస్తారని పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. అదే రోజు వరంగల్‌లో సభ నిర్వహించేందుకు చర్చిస్తున్నామని, రెండు రోజుల్లో ప్రధాని పర్యటన ఖరారు అవుతుందని అంటున్నారు.

హైదరాబాద్‌ వేదికగా జులై 8న ఏకంగా 11 రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఈ కీలక సమావేశం పార్టీపై సానుకూల ప్రభావం చూపుతుందని బిజెపి అధిష్టానం భావిస్తోంది.