6వ తేదీన కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోడీ

పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని

pm-modi-to-visit-karnataka-on-6th-february

న్యూఢిల్లీః ప్రధాని మోడీ ఫిబ్రవరి 6న (సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ (IEW) 2023ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తుమకూరులోని హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11.30 నుంచి సాయంత్రం వరకు కర్ణాటకలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇథనాల్ బ్లెండింగ్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా E20 ఇంధనాన్ని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. హరిత ఇంధనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రీన్ మొబిలిటీ ర్యాలీని కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఇండియన్ ఆయిల్ ‘అన్ బాటిల్’ చొరవ కింద దాదాపు 28 పిఇటి బాటిళ్లను రీసైక్లింగ్ చేయడానికి మద్దతు ఇచ్చేందుకు వీలుగా యూనిఫారమ్‌లను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్, ట్విన్-కూక్‌టాప్ మోడల్‌ను ప్రధాని అంకితం చేశారు. విప్లవాత్మక ఇండోర్ సోలార్ వంట సొల్యూషన్ సౌర సహాయక శక్తి వనరులపై ఏకకాలంలో పని చేసేలా తీర్చిదిద్దారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్త దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ తుమకూరులోని HAL హెలికాప్టర్ ఫ్యాక్టరీని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్, తుమకూరులో రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

ఈ సందస్సు ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు జరగనుంది. IEW శక్తి పరివర్తన పవర్‌హౌస్‌గా భారతదేశాన్ని తీర్చిదిద్దడం.. పెరుగుతున్న ఇంధన వనరులను నియంత్రించమే లక్ష్యంగా భారత్ స్పష్టమైన రోడ్ మ్యాప్ తో ముందుకుసాగుతోంది. ఈ సదస్సులో సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన పరిశ్రమ, ప్రభుత్వాలు, విద్యాసంస్థలకు చెందిన నాయకులు పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 మందికి పైగా మంత్రులు హాజరుకానున్నారు, 30,000 మంది ప్రతినిధులు, 1,000 మంది ప్రదర్శనకారులు, 500 మంది వక్తలు భారతదేశ ఇంధన భవిష్యత్తు.. సవాళ్లు, అవకాశాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి గ్లోబల్ ఆయిల్, గ్యాస్ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పలు కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఎనర్జీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ & బయో ఫ్యూయల్స్ ప్రోగ్రామ్ కింద గత ఎనిమిదేళ్ల కాలంలో సాధించిన విజయాల గురించి చర్చించనున్నారు.

కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు బిజెపి పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభివృద్ధి పనులు, బడ్జెట్‌ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. దీంతో బిజెపి కర్ణాటకపై ఫోకస్ పెట్టి.. ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని సైతం నియంమించింది. కర్ణాటక అసెంబ్లీ బిజెపి ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ను నియమించింది ఆ పార్టీ. అలాగే కో ఇన్‌ఛార్జిగా తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలైను నియమించింది. మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ప్రకటనను విడుదల చేశారు. వీరి నియామకం అనంతరం ప్రధాని మోడీ కర్ణాటకలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.