రేపు పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

PM Modi will visit West Bengal tomorrow

న్యూఢిల్లీః ప్రధాని మోడీ డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. దాదాపు రూ. 7800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కోల్‌కతాలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరగనున్న జాతీయ గంగా కౌన్సిల్ 2వ సమావేశంలో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుండి న్యూ జలపాయిగురి జంక్షన్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో యొక్క పర్పుల్ లైన్ జోకా-తరటాలా స్ట్రెచ్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. బహుళ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే న్యూ జలపాయిగురి జంక్షన్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. శుక్రవారం ఉదయం హౌరా రైల్వే స్టేష‌న్‌కి చేరుకుని అక్కడి నుంచి న్యూ జలపాయిగురి జంక్షన్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అలాగే డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్‌ని ఆయన ప్రారంభిస్తారు. జాతీయ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద పశ్చిమ బెంగాల్ కోసం బహుళ మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి, దేశానికి అంకితం చేస్తారు. దేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని పెంపొందించడంలో భాగంగా కోల్‌కతాలో డిసెంబర్ 30 (శుక్రవారం) జరిగే నేషనల్ గంగా కౌన్సిల్ 2వ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న ఇతర కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గంగా నది, దాని ఉపనదుల కాలుష్య నివారణ, పర్యవేక్షణ కోసం జాతీయ గంగా కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

990 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద అభివృద్ధి చేసిన 7 సీవరేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు నబద్వీప్, కచరప్రా, హలిషర్, బడ్జ్-బడ్జ్, బరాక్‌పూర్, చందన్ నగర్, బన్స్‌బేరియా, ఉత్తరాపరా కోట్రుంగ్, బైద్యబతి, భద్రేశ్వర్, నైహతి, గరులియా, టిటాగర్, పానిహతి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి. 1585 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద అభివృద్ధి చేయనున్న 5 మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ రోడ్‌లోని జోకాలో అభివృద్ధి చేసిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్‌ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సంస్థ దేశంలో నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత పై దేశంలో ఒక అపెక్స్ బాడీగా పనిచేస్తుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/