నేడు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన…

ప్రధాని మోడీ నేడు అయోధ్య లో పర్యటించబోతున్నారు. ఈ సందర్బంగా పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 22వ తేదీన ఈ ఆలయం ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధునికీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌తో పాటు 15,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన మోదీ.. అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ‘‘శ్రీరాముడి నగరమైన అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలికవసతుల ఏర్పాటు, కనెక్టివిటీ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాను. అంతేకాకుండా, ఇతర కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తాను. దీంతో, అయోధ్య నగర ప్రజల జీవనం మరింత మెరుగవుతుంది’’ అని ప్రధాని మోదీ హిందీలో పోస్ట్ చేశారు.

ఉదయం 11.15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యలో ఆధునికీకరించిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత అమృత్ భారత్, వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.