అబుదాబిలో తొలి హిందూ దేవాలయం..ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi to inaugurate BAPS Hindu Mandir in UAE on Feb 14

న్యూఢిల్లీః అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అబుదాబిలోని అబు మురీఖా వద్ద ఈ భారీ ఆలయం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ ఈ ఆలయ నిర్మాణకర్త. ఈ ఆలయం ఫిబ్రవరి 14న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మహంత్ స్వామి మహరాజ్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13న ఇక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా నిలవనుంది.

కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే మొదటి హిందూ దేవాలయం కానుంది. 27 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఈ ఆలయ బడ్జెట్ సుమారు రూ.700 కోట్లు అని మీడియా కథనాలు చెబుతున్నాయి. 2015లో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా అక్కడి పాలకులు ఈ ఆలయానికి భూమి కేటాయించారు. 1980లో ఇందిరా గాంధీ పర్యటించిన తర్వాత యూఏఈలో పర్యటించిన భారత ప్రధాని మోడీనే. అందుకే 2015 నాటి మోడీ పర్యటన చారిత్రాత్మకంగా మిగిలిపోయింది.