మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత

ex-mla-kunja-satyavathi-passes-away

హైదరాబాద్‌ః భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా నిన్న అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భద్రాచలంలోని తన నివాసంలో ఆమెకు ఛాతీలో తీవ్ర నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.

సీపీఎం పార్టీ ద్వారా కుంజా సత్యవతి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1991లో ఆ పార్టీ ద్వారా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ చొరవతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ చనిపోయిన తర్వాత ఆమె వైఎస్‌ఆర్‌సిపి లో చేరారు. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికే చేరినప్పటికీ… రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బిజెపిలో ఉన్నారు. ఆమె భౌతిక కాయానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నివాళి అర్పించారు.