రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యంః ప్రధాని మోడీ

pm-modi- speech-in-jagtial-sabha

జగిత్యాల : తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బిఆర్ఎస్ నేతల అవినీతిని సభా వేదికపై ఎండగట్టారు.

తెలంగాణ వికాసం కోసం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిఆర్ఎస్‌ను ఓడించి ఆ పార్టీ నేతలకు గుణపాఠం నేర్పాలని కోరారు. కవిత అరెస్ట్‌పై మోడీ మొదటిసారి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్‌ఎస్ సర్కారు అవినీతికి పాల్పడగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని, కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని మండిపడ్డారు.

బిఆర్ఎస్ ను కాపాడాలని చూస్తోందని, అందుకే అవినీతిపై విచారణ జరిపించడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, తాము మాత్రం అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తాము మాత్రం రాష్ట్రాలను, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి నిరంతరం పాటుపడుతున్నామని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ గ్యారంటీ అని చెప్పారు.

రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసే కుటుంబ పార్టీలను దూరంపెట్టాలని ప్రజలను కోరారు. మహిళా శక్తి చాలా గొప్పదని పేర్కొంటూ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని మోదీ పిలుపునిచ్చారు. బిజెపికి ఓటేసి తనను ఆశీర్వదించాలని మహిళలను కోరారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేస్తోందని. మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవంలేదని ప్రధాని విమర్శించారు.