మళ్లీ ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

Delhi CM

న్యూఢిల్లీః ఢిల్లీ జల్‌బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ ఎదుట హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. యథాప్రకారంగానే ఈ సమన్లను కూడా కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఈ సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చట్టవ్యతిరేకమని కొట్టిపడేసింది.

మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్‌పై నమోదైన రెండో కేసు ఇది. ఇప్పటికే ఆయన ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులోనూ ఈడీ పలుమార్లు నోటీసులు జారీచేసినా ఢిల్లీ సీఎం పక్కనపెట్టారు. జల్‌బోర్డు అక్రమాలకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈడీ గత నెలలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు, ఆప్ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీ జల్‌బోర్డు మాజీ సభ్యుడు, ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇళ్లపై దాడిచేసింది. ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అర్హత లేకున్నా రూ. 38 కోట్ల విలువైన ఢిల్లీ జల్‌బోర్డు కాంట్రాక్ట్‌ను అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.