కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుః ప్రధాని మోడీ
న్యూఢిల్లీః బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ఆయన తన నివాసంలో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి కెసిఆర్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్స చేయాలో వద్దోనన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని యశోద వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పలువురు బిఆర్ఎస్ నేతలు కెసిఆర్ను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ ఆరోగ్యంపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కెసిఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయనకు గాయమైందని తెలిసి బాధగా ఉందని.. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.