ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి..వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ప్రధాని

pm-modi-bhimavaram-tour

అమరావతిః ప్రధాని మోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోడీ అన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు.

మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/