ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
హైదరాబాద్ : నగరంలోని ఇక్రిశాట్లో ప్రధాని మోడీ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోడీ ప్రసింగించారు. స్సర్ణోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఆజాదీ కీ అమృత్సోవ్ వేళ ఇక్రిశాట్ స్సర్ణోత్సవాలను జరుపుకుంటుందన్నారు. సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పనిచేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు ఇక్రిశాట్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. టెక్నాలజీని మార్కెట్తో అనుసంధానించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు.
ప్రకృతి సాగుకు, డిజిటల్ విధానంలో వ్యవసాయ విధానాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. సాగులో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని చెప్పారు. పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. నిల్వ వసతులు పెంచుతామని అన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని.. అందరికీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు
దేశంలో నదుల అనుసంధానాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగకరంగా.. నీటి వనరులను అభివృద్ధి చేయనున్నామన్నారు. దేశంలో వాతావరణంలో కలుగుతున్న మార్పులు.. చిన్న రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాతావరణ మార్పులపై ఇతర దేశాలు కూడా తగిన విధంగా స్పందించాలని కోరిన విషయాన్ని ప్రధాని మోడీ.. ఇక్రిశాట్ వేదికపై గుర్తు చేశారు. డిజిటల్ వ్యవసాయం అన్నది భారత భవిష్యత్తుగా ప్రధాని మోడీ చెప్పారు. నైపుణ్యం ఉన్న యువత.. ఈ దిశగా అడుగులు వేయాలన్నారు. క్రాప్ అసెస్ మెంట్, భూ రికార్డుల డిజిటలైజేషన్, సాగులో డ్రోన్ల వినియోగం వంటి చర్యలు అమలు కానున్నట్టు మోడీ చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/