ఈ నెల 9న విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్

శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు..పలు యాగాల్లో పాల్గొననున్న జగన్

అమరావతి: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ ఈ నెల 9న విశాఖ వెళుతున్నారు. శారదాపీఠంలో నిర్వహించే రుద్రయాగం, రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇటీవల సీఎం జగన్ ను ఆహ్వానించారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర ఇటీవల తాడేపల్లి విచ్చేసి సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందజేశారు.

కాగా, ఫిబ్రవరి 9న సీఎం జగన్ ఉదయం గన్నవరం నుంచి బయల్దేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి వెళతారు. అక్కడి కార్యక్రమాలు ముగిసిన అనంతరం విజయవాడ తిరుగుపయనమవుతారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/