సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే సినిమా టికెట్ల విక్రయం
అమరావతి: ఏపీ శాసనసభ నేడు రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన సినిమాటోగ్రఫీ బిల్లు కూడా ఉంది. మరోటి వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఇకపై సినిమా టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించనున్నారు. ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.
దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే టికెట్ కొనుగోలు చేయాలి. అంటే, ఇకపై నేరుగా థియేటర్కు వెళ్లి టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసే వెసులుబాటు లేనట్టే. సీఎం జగన్ తరపున ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి నాని.. బిల్లు లక్ష్యాన్ని చదివి వినిపించారు. అలాగే, కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ సవరించారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్ను 1 నుంచి నాలుగు శాతం వరకు పెంచారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై అదనంగా రూ. 409 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/