నేడు విజయవాడ దుర్గమ్మ సన్నిధానంలో వారాహీకి పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడ దుర్గమ్మ సన్నిధానంలో తన వారాహి కి పూజలు నిర్వహించబోతున్నారు. మంగళవారం కొండగట్టు అంజన్న సన్నిధానంలో వారాహి కి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకున్నారు. నేడు విజయవాడ కు రాబోతున్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి విజయవాడ దుర్గమ్మ సమక్షంలో పూజలు నిర్వహించనున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసారు. అలాగే పవన్ రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేసారు.

ఇదిలా ఉంటె నిన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన లో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయి ని ఫాలో అవుతూ వస్తూ ఓ అభిమాని మృతి చెందాడు. పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న సన్నిధానంలో తన వారాహి వాహన పూజా కార్య క్రమాలు జరిపారు. ఇందుకు గాను హైదరాబాద్ నుండి ఉదయం భారీ కాన్వాయి తో బయలు దేరారు. పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ప్రజలు , అభిమానులు నీరాజనాలు పలికారు. ఇదే క్రమంలో వందలాది మంది అభిమానులు పవన్ కాన్వాయి వెంట వచ్చారు.

ఈ క్రమంలో తమ అభిమాన నేతకు అభివాదం చేసే ప్రయత్నం చేసి నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో తలకు తీవ్ర గాయమై ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.