పొత్తులపై జనసైనికులకు పవన్ హితోపదేశం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఎన్నికల పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడర్ కు సూచించారు.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు చేయొద్దన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నాం.

ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న ఈ దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారు.

ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సలహాలు ఏవైనా ఉంటే నా రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావొచ్చు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరతాయి. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చాను.

పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరం” అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.