రౌడీ షీటర్‌‌కు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది?: పవన్ కల్యాణ్

తన వాళ్లను కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్లతోనే విశాఖ ఎంపీ మిలాఖత్ అయ్యారన్న పవన్

pawan-kalyan-made-comments-on-visakha-mp-mvv-satyanarayana

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై మండిపడ్డారు. కిడ్నాపర్లకు ఎంపీ మద్దతు ఇస్తున్నారని, దుర్మార్గులను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్లతోనే ఎంపీ మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. డబ్బులతో గెలిచిన ఎంపీలు ఇలానే దద్దమ్మల్లా ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘రౌడీ షీటర్‌‌కు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది? సదరు ఎంపీ ఆ రౌడీ షీటర్‌‌కు వత్తాసు పలికేలా చర్యలు ఉండటమేంటి?” అని పవన్ నిలదీశారు. ధైర్యం, దమ్ము లేనోళ్లే రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. ‘‘సొంత కుటుంబం మీద దాడి జరిగితే దిక్కూమొక్కూలేదు. పైగా భయంతోటి సమర్థించుకుంటున్నారు. నువ్వెవరు చెప్పడానికని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇది నీ ఇంట్లో సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల సమస్య. వీటిన్నింటినీ కచ్చితంగా కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్తా” అని జనసేనాని స్పష్టం చేశారు.