కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాద ఛాయలు అల్లుకున్న సంగతి తెలిసిందే. కీరవాణి తల్లి భానుమతి బుధువారం కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న వీరు..ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులు కీరవాణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఈ క్రమంలో సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కీరవాణి మాతృమూర్తి భానుమతి గారు కన్నుమూశారని తెలిసి చింతించానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. భానుమతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భానుమతి గారి భర్త శివశక్తి దత్తా, ఆమె కుమారుడు కీరవాణి గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ వివరించారు.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములు అనే సంగతి తెలిసిందే. అందరూ ఉమ్మడి కుటుంబంలోనే పెరిగారు. రాజమౌళికి పెద్దమ్మ అంటే ఎంతో ఇష్టం కావడంతో ఆమె మృతదేహాన్ని రాజమౌళి ఇంటికి తరలించారు. రాజమౌళి ప్రతి సినిమాకు కీరవాణినే సంగీతం అందిస్తారు. అన్నదమ్ములు ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలువడం విశేషం. ఇక రేపు భానుమతి అంత్యక్రియలు జరగనున్నాయి.