కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి మనోహర్ ఎందుకు వెళ్లినట్లు..?

ఏపీ బిజెపి మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. గత కొద్దీ రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు – కన్నా లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. కన్నా సైతం బిజెపి కార్య క్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో మనోహర్..కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ కావడం చర్చకు దారితీసింది. కన్నా లక్ష్మీనారాయణ జనసేన లో చేరబోతున్నాడా..? ఆయనకు ఆహ్వానం పలికేందుకు మనోహర్ వెళ్లాడా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. అయితే.. మనోహర్ మాత్రం ఆ వార్తలను ఖండించారు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయని వ్యాఖ్యానించారు. మరి వీరిద్దరి భేటీ ఎందుకా అని మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు.

ఏపీలో బలపడేందుకు జనసేన చాలాకాలం ప్రయత్నిస్తోంది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి కొత్త ఊపు వస్తోందని లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏపీలో బీజేపీ , జనసేన కలిసే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అలాంటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అనే చర్చ కూడా సాగుతోంది. మరి వీరిద్దరి కలయిక ఏంటనేది త్వరలో తెలుస్తుంది.