దేశంలో కొత్తగా 12,591 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 12,591 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత ఎనిమిది నెలల్లో ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. బుధవారం నాటికంటే ఇది 20 శాతం అధికం. నిన్న 10,542 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.48 కోట్లకు పెరిగింది. ఇందులో 4,42,61,476 మంది బాధితులు కోలుకున్నారు. మరో 65,286 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 29 మంది మరణించడంతో మృతులు 5,31,230కి చేరారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతం కాగా, 0.15 శాతం కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.67 శాతం మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.