ఆంధ్రకు క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్

ఈ నెల 13 న ఏపీలో అసెంబ్లీ ,లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఆంధ్ర ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఓటేయడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు క్యూకట్టాయి. పెద్ద ఎత్తున వాహనాలు తరలివస్తుండటంతో భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. టోల్‌ చెల్లింపునకు వాహనాలు బారులు తీరడంతో పంతంగి నుంచి చౌటుప్పల్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుకుండటంతో హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌ మెట్‌ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. శుక్రవారం రాత్రి నుంచే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.