భారీ వర్షాలు ..వరదలు.. సిక్కింలో చిక్కుకుపోయిన 2,000 మంది పర్యాటకులు

2,000 Tourists Stranded In Sikkim Due To Heavy Rain, Flashflood

గ్యాంగ్‌టక్‌: సిక్కింలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో పెంగాంగ్‌ సప్లయ్‌ ఖోలా వద్ద మంగాన్‌ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్‌ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో లెచెన్‌, లచుంగ్‌ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

వారిలో 1975 మంది దేశీయ పర్యాటకులుగా, 36 మంది విదేశీయులు ఉన్నారని వెల్లడించారు. విదేశీయుల్లో 23 మంది బంగ్లాదేశీయులు, మరో పది మంది అమెరికా, ముగ్గురు సింగపూర్‌కు చెందినవారని చెప్పారు. అదేవిధంగా 345 కార్లు, 11 బైకులు బురుదలో కూరుకుపోయాయన్నారు. వరదలు ఆగిన తర్వాత రోడ్డుకు మరమ్మతులు చేస్తామని వెల్లడించారు.