నారా లోకేష్ యువగళం 54 వ రోజు హైలైట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈరోజు 54 వ రోజు పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగింది. బుధువారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి సమీపంలోని నలగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేష్ సెల్ఫీ ఇచ్చారు.

లోకేష్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలోకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గీయులతో లోకేష్ భేటి అయ్యారు. అనంతరం ముందుకు సాగిన లోకేష్ సోమందేపల్లి దళితవాడలో ఎస్సీ వర్గీయులతో సమావేశం అయ్యారు. అనంతరం మహిళలతో, చేనేతలతో సమావేశం అయ్యారు. పెనుకొండ మండలం వెంకటాపురం తండాలో స్థానికులను లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పెనుకొండ ఎన్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వ్యాపారులతో లోకేష్ బాబు సమావేశం అయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తామో లోకేష్ వివరించారు.