మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి కన్నుమూత

సీనియర్ రాజకీయ నేత, ఏపీ మాజీ మంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి (92) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్య్లలతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నారాయణస్వామి ఏప్రిల్ 30న 1931లో జన్మించారు.

నారాయణస్వామి 1972లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1985, 1999లలో రెండు సార్లు టీడీపీ నుండి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 – 99 మధ్య రాజ్యసభ సభ్యుడిగా నారాయణ స్వామి పని చేశారు.

ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి చిన్నాన్నే యర్రా నారాయణ స్వామి. నారాయణస్వామి మృతికి టీడీపీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.