దీనిపై విచారణ జరిపించాలి: లోకేశ్

నాడు-నేడు చెల్లింపులు ఆపేశారని ఓ స్కూలు కమిటీ చైర్మన్ ఆవేదన: నారా లోకేశ్

అమరావతి : జగన్ నాడు-నేడు గుట్టుని సుబ్బారెడ్డి రట్టు చేశారని లోకేశ్ వ్యాఖ్యానించారు. నాడు-నేడు అక్రమాల పుట్ట అని, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని నేను అనగానే కొంతమంది అధికారులు తొందరపడి మరీ ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయాలు చేయొద్దంటూ ఉపన్యాసాలు ఇచ్చారు అని విమర్శించారు.

“ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సురేశ్ గారి యర్రగొండపాలెం నియోజకవర్గంలో గుర్రపుశాల ఎంపీపీ స్కూల్ విద్యాకమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి నాడు-నేడు పేరుతో జరుగుతున్న అక్రమాలు మొత్తం బహిర్గతం చేశారు. ఇదో దోపిడీ కార్యక్రమం అని సొంతపార్టీ వాళ్లే కుండబద్దలు కొడుతున్నారు. దీనిపై విచారణ జరిపితే… పిల్లల పేరుతో వైస్సార్సీపీ పందికొక్కులు తిన్న కోట్ల లెక్కలు బయటపడతాయి” అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.

కాగా, తనకు నాడు-నేడు పనులకు సంబంధించిన చెల్లింపులు ఆపేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ఎంపీపీ స్కూల్ చైర్మన్ సుబ్బారెడ్డి ఓ సెల్ఫీ వీడియో తీశారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని, జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేశ్ కు నివేదించినా ప్రయోజనం శూన్యమని సుబ్బారెడ్డి వాపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/