అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్లతో నీ ఓట‌మి..ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, మా టీడీపీ కుటుంబ‌స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధ గారికి హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవ చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్లతో నీ ఓట‌మి-మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు!’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ ఇచ్చింది టీడీపీ. 7 స్థానాలకు 7 స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసిన వైస్సార్సీపీ..టీడీపీ షాక్ ఇచ్చింది. ఓ స్థానంలో పోటీ చేసి విజయం సాధించింది. టీడీపీ నుండి బరిలో నిల్చున్న పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం డంఖా మోగించారు. వాస్తవానికి తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు.

మరోవైపు వైస్సార్సీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజయం సాధించారు. అనురాధ విజయంతో వైస్సార్సీపీ అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓటమిపాలు కానున్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. టీడీపీ అభ్యర్థి అనురాధకు అత్యధిక ఓట్లు పడటం గమనార్హం. ఆమెకు 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 19 మంది ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.