రాయచోటి పురపాలక కార్యాలయం ఎదుట చెత్త సేకరణ వాహన డ్రైవర్ల నిరసన

అన్నమయ్య జిల్లా రాయచోటి పురపాలక కార్యాలయం ఎదుట చెత్త సేకరణ వాహన డ్రైవర్లు నిరసన కు దిగారు. గత నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని , ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నామని , ప్రభుత్వం వెంటనే తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. వేతనాల గురించి అధికారులను అడిగితే విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయచోటి పురపాలక పరిధిలో 26 చెత్త సేకరణ వాహనాలు ఉండగా.. సోమవారం వాటిని నిలిపివేశారు. పట్టణంలో చెత్త నిల్వలు పెరిగిపోవడంతో పురపాలక వాహనాల నిర్వాహకులు వేరే వాళ్లతో చర్చలు జరిపి డ్రైవర్ల సమస్యను వెంటనే పరిష్కరించి, వేతనాలు చెల్లిస్తామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. డ్రైవర్లకు వేతనాల సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం తగదని.. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.