వట్టెం గ్రామంలో సందడి చేసిన మహేష్ వైఫ్ నమ్రత

సినీ స్టార్స్ కు నిత్యం సినిమాలే కాదు వీలు కుదిరినప్పుడల్లా దైవ దర్శనాలు చేసుకోవడం చేస్తుంటారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఏడాదిలో పలు నెలల పాటు అయ్యప్ప మాల వేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సందడి చేసారు. వట్టెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. పద్మావతి, అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ గోశాలను కూడా సందర్శించారు. నమ్రత గ్రామానికి వచ్చిందనే విషయం తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు , ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

తెలంగాణ చిన్న తిరుపతిగా పేరు పొందిన ఈ వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నమ్రతా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయాన్ని చూస్తే తిరుపతి వెళ్లిన అనుభూతి కలుగుతుందని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. గుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారు కొలువు తీరారని అన్నారు.