రేవంత్ రెడ్డి కి మిర్చి బజ్జి అందించిన గంగవ్వ

యూట్యూబ్ ద్వారా యావత్ తెలుగు వారికీ సుపరిచితురాలైన గంగవ్వ..తాజాగా పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి కి మిర్చి బజ్జి అందజేసింది. హాత్ సే హాత్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ని కలిసిన గంగవ్వ స్వయంగా ఆమె చేసిన మిర్చి బజ్జీలను అందజేసింది. దీంతో రేవంత్ ఎంతో సంతోషంగా గంగవ్వ తెచ్చిన మిర్చిలను ఆరగించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

“గంగవ్వ… తెలంగాణకు పరిచయం అక్కర్లేని అవ్వ. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నాకోసం ఆప్యాయంగా, నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ తీసుకువచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించేవాడిని. తల్లిని గుర్తుచేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను” అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి పంచుకున్నారు.