చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయి కలపాలిః నారా భువనేశ్వరి
కనకదుర్గమ్మకు తన బాధను చెప్పుకున్నానన్న భువనేశ్వరి
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/09/nara-bhuvaneswari-response-on-chandrababu-arrest-jpg.webp)
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి స్పందించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం తన సోదరుడు రామకృష్ణతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడుతూ… తన భర్తను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఒక బిడ్డకు మనసు బాగో లేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు. అందుకే విజయవాడ కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి, ఆమె ఆశీర్వచనం కోసం ఇక్కడకు వచ్చాను. అమ్మవారిని నేను కోరింది ఒకటే. మా ఆయన చంద్రబాబును రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నా. ఆయన పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం. నేను ఒక్కటే కోరుతున్నా… మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలి. జై దుర్గాదేవి, జైహింద్, జై అమరావతి’ అని భువనేశ్వరి అన్నారు.