మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. రెండు, మూడు, 15వ రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. ఫలితంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విక్టరీ కొట్టింది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. గట్టుప్పల్ మండల పరిధిలోని మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. నేతన్నల ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకు పడ్డాయి. చేనేతకు మరణ శాసనం రాసిన మోదీకి నేతన్నలు గట్టిగా సమాధానం చెప్పారు.