జూన్ 5 – 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల రాక
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Monsoon-arrival-in-Telangana-between-June-5-11.jpg)
హైదరాబాద్ః తెలంగాణ ప్రజలకు ఓ శుభవార్త.. జూన్ 5 – 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మారు నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి అయిదారు రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20నాటికి విస్తరించిన విషయం తెలిసిందే.
ఇక మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.