తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ని అధిష్టానం నియమించబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను మార్చుతారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తోన్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను అధ్యక్షుడి గా నియమిస్తారని కొంతమంది ప్రచారం చేస్తే లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని నియమిస్తారని మరికొంతమంది చెపుతూ వచ్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కిషన్ రెడ్డి నే అధ్యక్షుడి గా నియమిస్తారని తెలుస్తుంది.

బండి సంజయ్‌కు కేంద్రమంత్రి వర్గంలో లేదంటే పార్టీ జాతీయ నాయకత్వంలో బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు నాలుగు రోజుల్లోనే అధిష్ఠానం నుంచి ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడమే మేలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ హయాంలో తెలంగాణలో బీజేపీకి కావాల్సినంత హైప్ వచ్చింది. పలు ఎన్నికల్లో అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది.